కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసులా ధైర్యంగా ప్రకటించండి

యేసులా ధైర్యంగా ప్రకటించండి

యేసులా ధైర్యంగా ప్రకటించండి

‘మీకు సువార్త ప్రకటించడానికి ధైర్యం తెచ్చుకున్నాం.’—1 థెస్స. 2:2.

1. రాజ్యసువార్తను మనం ఎందుకు చాలా ఇష్టపడతాం?

మంచి వార్తను వినడానికి మనందరం ఇష్టపడతాం. వార్తలన్నిటిలోకెల్లా మంచి వార్త దేవుని రాజ్య సువార్తే. కష్టాలు, అనారోగ్యం, బాధలు, దుఃఖం, మరణం త్వరలో ఉండవనే అభయాన్ని అది ఇస్తుంది. నిత్యజీవం పొందుతామనే ఆశను మనలో నింపుతుంది. దేవుని ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. ఆయనతో అనుబంధాన్ని ఎలా ఏర్పరచుకోవచ్చో చూపిస్తుంది. యేసు మానవులతో పంచుకున్న ఆ వార్తను వినడానికి అందరూ ఇష్టపడతారని మనం అనుకోవచ్చు. కానీ విచారకరంగా అందరూ దాన్ని ఇష్టపడరు.

2. “విరోధము పెట్టవచ్చితిని” అని యేసు ఎందుకు అన్నాడో వివరించండి.

2 యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: “నేను భూమిమీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి; ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని. ఒక మనుష్యుని యింటివారే అతనికి శత్రువులగుదురు.” (మత్త. 10:34-36) చాలామంది సువార్తను సంతోషంగా వినే బదులు దాన్ని తిరస్కరిస్తారు. కొందరైతే, సువార్త ప్రకటించేవారందరినీ శత్రువులుగా చూస్తారు. చివరకు వారు తమ సొంత కుటుంబ సభ్యులే అయినా అలా చూస్తారు.

3. ప్రకటనా పని చేయడానికి మనకు ఏమి అవసరం?

3 మనం యేసు ప్రకటించిన సత్యాలనే ప్రకటిస్తున్నాం. ప్రజలు ఆయన కాలంలో స్పందించినట్లే మన కాలంలోనూ స్పందిస్తున్నారు. ప్రజల స్పందన అలా ఉంటుందని మనకు తెలుసు. ఎందుకంటే, యేసు తన శిష్యులతో, ‘దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడు. లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు’ అని అన్నాడు. (యోహా. 15:20) అనేక దేశాల్లో ప్రజలు మనల్ని తీవ్రంగా హింసించకపోయినా మనల్ని చిన్నచూపు చూస్తున్నారు, సువార్త వినడానికి ఇష్టపడడంలేదు. కాబట్టి, సువార్త ప్రకటనా పనిని భయపడకుండా చేయడానికి మనకు విశ్వాసం, ధైర్యం అవసరం.—2 పేతురు 1:5-8 చదవండి.

4. పౌలు ప్రకటించడానికి ఎందుకు ‘ధైర్యాన్ని కూడగట్టుకోవాల్సివచ్చింది’?

4 పరిచర్యలో పాల్గొనడం మీకు కొన్నిసార్లు కష్టమనిపించవచ్చు లేదా ఒకానొక పద్ధతిలో పరిచర్య చేయాలంటే మీకు భయమనిపించవచ్చు. అదే నిజమైతే, మీకు ఒక్కరికే కాదు, ఇతరులు కూడ అలా అనిపిస్తుందని గుర్తుంచుకోండి. సత్యం గురించిన మంచి అవగాహన ఉన్న అపొస్తలుడైన పౌలు నిర్భయంగా, ధైర్యంగా ప్రకటించాడు. అయినప్పటికీ, కొన్నిసార్లు ఆయనకు కూడ ప్రకటించడం కష్టమనిపించింది. పౌలు థెస్సలొనీకయులకు పత్రిక రాస్తూ, “మీరెరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానముపొంది, యెంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవునియందు ధైర్యము తెచ్చుకొంటిమని [‘కూడగట్టుకున్నామని,’ NW] మీకు తెలియును” అని చెప్పాడు. (1 థెస్స. 2:2) పౌలు, సీల ఫిలిప్పీలో ఉన్నప్పుడు అక్కడి అధికారులు వారిని బెత్తములతో కొట్టి, చెరసాలలో పడేసి, వారి కాళ్లకు బొండవేసి బిగించారు. (అపొ. 16:16-24) అయినప్పటికీ పౌలు సీలలు ప్రకటనా పనిలో కొనసాగడానికి ‘ధైర్యాన్ని కూడగట్టుకున్నారు.’ వారిలాగే మనం ధైర్యాన్ని ఎలా కూడగట్టుకోవచ్చు? బైబిలు కాలాల్లో యెహోవా గురించిన సత్యాన్ని ఆయన సేవకులు ధైర్యంగా ఎలా మాట్లాడగలిగారో తెలుసుకొని, వారి ఉదాహరణను మనం ఎలా అనుకరించవచ్చో చూద్దాం.

వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు వారికి ధైర్యం అవసరమైంది

5. యథార్థవంతులైన యెహోవా సేవకులకు ఎల్లప్పుడూ ధైర్యం ఎందుకు అవసరమైంది?

5 ధైర్యంగా, నిర్భయంగా ప్రకటించే విషయంలో యేసుక్రీస్తే శ్రేష్ఠమైన మాదిరి. మానవ చరిత్ర ఆరంభం నుండి యథార్థవంతులైన యెహోవా సేవకులందరికీ ఎల్లప్పుడూ ధైర్యం అవసరమైంది. ఎందుకు? ఏదెను తోటలో తిరుగుబాటు జరిగిన తర్వాత దేవుని సేవకులకూ, సాతాను సేవకులకూ మధ్య వైరం ఉంటుందని యెహోవా చెప్పాడు. (ఆది. 3:15) అలా ప్రవచించిన కొంతకాలానికే నీతిమంతుడైన హేబెలును ఆయన అన్న హత్య చేసినప్పుడు ఆ వైరం స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత, జలప్రళయానికి ముందు జీవించిన మరో నమ్మకమైన సేవకుడైన హనోకును సాతాను సంబంధీకులు వ్యతిరేకించారు. దేవుడు తన వేవేల పరిశుద్ధ సేనలతో వచ్చి భక్తిహీనులకు తీర్పుతీరుస్తాడని హనోకు ప్రవచించాడు. (యూదా 14, 15) చాలామంది ఆయన చెప్పినదాన్ని ఇష్టపడలేదు. ప్రజలు ఆయనను ద్వేషించారు. యెహోవా ఆయన ఆయుష్షును తగ్గించకుంటే వారు ఆయనను చంపేసివుండేవారే. హనోకు ఎంత ధైర్యాన్ని చూపించాడు!—ఆది. 5:21-24.

6. ఫరోతో మాట్లాడడానికి మోషేకు ఎందుకు ధైర్యం అవసరమైంది?

6 ఫరోతో మాట్లాడుతున్నప్పుడు మోషే చూపించిన ధైర్యం గురించి కూడ ఆలోచించండి. ప్రజలు ఫరోను దేవుళ్ల ప్రతినిధిగా మాత్రమే కాక, ఆయననే ఒక దేవునిగా, సూర్యదేవుడైన రా పుత్రునిగా పరిగణించేవారు. ఆయన ఇతర ఫరోల్లాగే తన సొంత ప్రతిమను ఆరాధించివుంటాడు. ఫరో చెప్పిందే న్యాయం, చేసిందే చట్టం. శక్తిమంతుడు, గర్విష్ఠి, మొండివాడు అయిన ఫరోకు ఇతరులతో చెప్పించుకునే అలవాటు లేదు. తనంటే ఇష్టంలేని అలాంటి వ్యక్తి దగ్గరికి ఎలాంటి ఆహ్వానం లేకుండా సాత్వికుడైన గొర్రెలకాపరి అయిన మోషే ఎన్నోసార్లు వెళ్లాడు. అతని దగ్గరికి వెళ్లి మోషే ఏమి చెప్పాడు? రాబోయే భయంకరమైన తెగుళ్ల గురించి చెప్పాడు. ఫరోను ఏమి కోరాడు? లక్షలాదిమంది ఫరో బానిసలను దేశాన్ని విడిచివెళ్లనివ్వమని కోరాడు! మోషేకు ధైర్యం అవసరమైందా? అవసరమైంది!—సంఖ్యా. 12:3; హెబ్రీ. 11:27.

7, 8. (ఎ) క్రీస్తుకు పూర్వం జీవించిన నమ్మకమైనవారు ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు? (బి) వారు ఎలా ధైర్యంగా స్వచ్ఛారాధన పక్షాన నిలబడి, దాని గురించి ఇతరులకు ప్రకటించగలిగారు?

7 ఆ తర్వాతి శతాబ్దాల్లో నమ్మకస్థులైన దేవుని సేవకులు స్వచ్ఛారాధన కోసం ధైర్యంగా ప్రవర్తించారు. సాతాను లోకం వారితో క్రూరంగా ప్రవర్తించింది. దాని గురించి పౌలు ఇలా చెప్పాడు: “రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొఱ్ఱెచర్మములను మేకచర్మములను వేసికొని, దరిద్రులైయుండి శ్రమపడి హింసపొం[దిరి].” (హెబ్రీ. 11:36-38) అన్ని శ్రమలెదురైనా యథార్థవంతులైన ఆ దేవుని సేవకులు స్థిరంగా ఎలా ఉండగలిగారు? హేబెలు, అబ్రాహాము, శారా మరితరులు శ్రమలు సహించేందుకు కావాల్సిన శక్తిని ఎలా పొందారో వివరిస్తూ పౌలు ఆ అధ్యాయంలోనే ఇలా చెప్పాడు: “వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచే[శారు].” (హెబ్రీ. 11:13) క్రీస్తుకు పూర్వం సత్యారాధన పక్షాన ధైర్యంగా నిలబడిన ఏలీయా, యిర్మీయా లాంటి ప్రవక్తలూ ఇతర నమ్మకమైన సేవకులూ దేవుని వాగ్దానాలు నెరవేరతాయనే నమ్మకంవల్లే శ్రమలను సహించగలిగారు.—తీతు 1:1.

8 వారు ఉజ్వలమైన, చక్కని భవిష్యత్తు కోసం ఎదురుచూశారు. వారు పునరుత్థానం చేయబడిన తర్వాత క్రమంగా పరిపూర్ణులై, క్రీస్తుయేసు, 1,44,000 మంది సహయాజకులు చేసే యాజకసేవల సహాయంతో “నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింప[బడతారు].” (రోమా. 8:20, 21) అంతేకాక యిర్మీయా, ప్రాచీన కాలానికి చెందిన ధైర్యవంతులైన మరితర సేవకులూ యెహోవా ఇచ్చిన అభయాన్నిబట్టి ధైర్యాన్ని కూడగట్టుకున్నారు. యెహోవా యిర్మీయాతో చేసిన వాగ్దానంలో ఆ అభయాన్ని చూస్తాం: “వారు నీతో యుద్ధముచేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై యున్నందున వారు నీపైని విజయము పొందజాలరు; ఇదే యెహోవా వాక్కు.” (యిర్మీ. 1:19) భవిష్యత్తు విషయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానాల గురించి, ఆధ్యాత్మిక రక్షణ గురించి ఆయన ఇచ్చిన భరోసా గురించి మనం ఆలోచించినప్పుడు మనమూ బలపర్చబడతాం.—సామె. 2:7; 2 కొరింథీయులు 4:17, 18 చదవండి.

ప్రేమవల్లే యేసు ధైర్యంగా ప్రకటించాడు

9, 10. యేసు (ఎ) మతనాయకుల ముందు (బి) సైనికుల ముందు (సి) ప్రధానయాజకుని ముందు (డి) పిలాతు ముందు ఎలా ధైర్యాన్ని చూపించాడు?

9 మన మాదిరికర్త అయిన యేసు అనేక విధాలుగా ధైర్యాన్ని చూపించాడు. ఉదాహరణకు, అధికారం, ప్రాబల్యం ఉన్నవారు తనను ఇష్టపడకపోయినా, ప్రజల కోసం దేవుడు ఇచ్చిన సందేశాన్ని ఆయన నీరుగార్చలేదు. ఆయన ధైర్యంగా శక్తిమంతులైన మతనాయకుల వేషధారణను, అబద్ధ బోధలను ఎత్తిచూపించాడు. యేసు స్పష్టంగా, నిక్కచ్చిగా వారిని ఖండించాడు. ఒక సందర్భంలో ఆయన వారిని ఉద్దేశించి ఇలా అన్నాడు: “అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నముకొట్టిన సమాధులను పోలియున్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చినవారి యెముకలతోను సమస్త కల్మషముతోను నిండియున్నవి. ఆలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని, లోపల వేషధారణతోను అక్రమముతోను నిండియున్నారు.”—మత్త. 23:27, 28.

10 గెత్సేమనే తోటలో యేసును బంధించడానికి కొంతమంది సైనికులు వచ్చినప్పుడు ఆయన ధైర్యంగా తానే యేసునని చెప్పాడు. (యోహా. 18:3-8) ఆ తర్వాత ఆయనను మహాసభకు తీసుకెళ్లారు. అక్కడ ప్రధానయాజకుడు ఆయనను విచారించాడు. తనను ఏదో ఒక నెపంతో చంపడానికి చూస్తున్నారని తెలిసినప్పటికీ తానే క్రీస్తునని, దేవుని కుమారుణ్ణని ధైర్యంగా చెప్పాడు. తాను “సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశమేఘారూఢుడై వచ్చుటయు చూచెదరు” అని కూడ చెప్పాడు. (మార్కు 14:53, 57-65) ఆ తర్వాత ఆయనను పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు. పిలాతుకు యేసును విడిపించే అధికారం ఉన్నా యేసు మాత్రం తనమీద చేయబడుతున్న ఆరోపణలకు జవాబివ్వలేదు. (మార్కు 15:1-5) ఇవ్వన్నీ చేయడానికి ఆయనకు ఎంతో ధైర్యం అవసరమైంది.

11. ధైర్యానికీ ప్రేమకూ మధ్య ఎలాంటి సంబంధముంది?

11 అయితే, ఆయన పిలాతుతో ఇలా అన్నాడు: “సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని.” (యోహా. 18:37) సువార్త ప్రకటించే పనిని యెహోవా యేసుకు అప్పగించాడు, ఆయనకు తన పరలోక తండ్రిపట్ల ప్రేమ ఉంది కాబట్టే తన తండ్రి చెప్పింది సంతోషంగా చేశాడు. (లూకా 4:18, 19) యేసుకు ప్రజలపట్ల కూడ ప్రేమ ఉంది. వారు కష్టాల్లో ఉన్నారని ఆయనకు తెలుసు. యేసులాగే మనం యెహోవాను, పొరుగువారిని ఎంతో ప్రేమిస్తున్నాం కాబట్టే మనం ధైర్యంగా నిర్భయంగా ప్రకటించగలుగుతున్నాం.—మత్త. 22:36-40.

ధైర్యంగా ప్రకటించడానికి పరిశుద్ధాత్మ

మనకు శక్తినిస్తుంది

12. తొలి శిష్యులు ఎందుకు ఆనందించారు?

12 యేసు మరణించిన కొద్దివారాల తర్వాత, యెహోవా ఆశీర్వాదంతో కొత్త శిష్యులు వచ్చి చేరడాన్ని చూసి శిష్యులు సంతోషించారు. పెంతెకొస్తు పండగ చేసుకోవడానికి అనేక దేశాల నుండి యెరూషలేముకు చాలామంది యూదులు, యూదా మతప్రవిష్టులు వచ్చారు. ఒక్కరోజులోనే వారిలో దాదాపు 3,000 మంది బాప్తిస్మం తీసుకున్నారు! యెరూషలేములో ప్రతీఒక్కరూ ఆ సంఘటన గురించి మాట్లాడుకొనేవుంటారు! అప్పుడు “ప్రతివానికిని భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములును సూచక క్రియలును అపొస్తలుల ద్వారా జరిగెను” అని బైబిలు చెబుతోంది—అపొ. 2:41, 43.

13. తమకు ధైర్యాన్ని ఇవ్వమని సహోదరులు ఎందుకు ప్రార్థించారు? వారు ప్రార్థించినప్పుడు ఏమైంది?

13 కోపంతో ఊగిపోయిన మతనాయకులు, పేతురు యోహానులను బంధించి రాత్రంతా చెరసాలలో ఉంచారు. యేసు గురించి మాట్లాడవద్దని వారిని ఆజ్ఞాపించారు. ఆ ఇద్దరు అపొస్తలులు విడుదల చేయబడిన తర్వాత వారు జరిగిందాన్ని సహోదరులకు తెలిపారు. వారందరూ కలిసి తాము ఎదుర్కొన్న వ్యతిరేకత గురించి ప్రార్థించి, “ప్రభువా, . . . నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము” అని వేడుకున్నారు. వారు ప్రార్థించినప్పుడు ఏమైంది? “వారందరు పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి.”—అపొ. 4:24-31.

14. ప్రకటనా పనిలో పరిశుద్ధాత్మ మనకు ఎలా సహాయం చేస్తుంది?

14 శిష్యులు దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించడానికి శక్తివంతమైన యెహోవా పరిశుద్ధాత్మ సహాయం చేసిందని గమనించండి. ఇతరులతో, చివరకు మన సందేశాన్ని వ్యతిరేకించేవారితో సత్యం గురించి మాట్లాడడానికి కావాల్సిన శక్తి మన దగ్గరలేదు. దాన్ని యెహోవాయే ఇస్తాడు. మనం పరిశుద్ధాత్మ కోసం ప్రార్థిస్తే ఆయన దాన్ని మనకు ఇవ్వగలడు. ఆయన దాన్ని ఇస్తాడు కూడ! యెహోవా సహాయంతో ఎలాంటి వ్యతిరేకతనైనా నమ్మకంగా సహించేందుకు కావాల్సిన ధైర్యాన్ని మనం కూడ కనబరచగలం.—కీర్తనలు 138:3 చదవండి.

నేడు క్రైస్తవులు ధైర్యంగా ప్రకటిస్తున్నారు

15. మన కాలంలో సత్యం ప్రజలను ఎలా వేరుచేస్తుంది?

15 గతంలోలాగే మన కాలంలోనూ సత్యం ప్రజలను వేరుచేస్తుంది. మన ఆరాధనను కొందరు ఇష్టపడుతుంటే, మరికొందరు దాన్ని అర్థంచేసుకోరు లేదా అదంటే వారికి గౌరవం ఉండదు. యేసు ముందు చెప్పినట్లే కొందరు మనల్ని విమర్శిస్తారు, హేళనచేస్తారు, చివరకు ద్వేషిస్తారు. (మత్త. 10:22) కొన్నిసార్లు ప్రచార మాధ్యమాలు మన గురించి తప్పుడు సమాచారాన్నిస్తూ, దుష్ప్రచారాన్ని చేస్తుంటాయి. (కీర్త. 109:1-3) అయినా, భూవ్యాప్తంగా, యెహోవా ప్రజలు ధైర్యంగా సువార్త ప్రకటిస్తున్నారు.

16. మన ధైర్యాన్ని చూసి ప్రజలు తమ అభిప్రాయాన్ని మార్చుకుంటారని ఏ ఉదాహరణ చూపిస్తోంది?

16 మనం ధైర్యంగా ప్రకటిస్తే ప్రజలు రాజ్య సందేశంమీద తమకున్న అభిప్రాయాన్ని మార్చుకోవచ్చు. కిర్గిజ్‌స్థాన్‌కు చెందిన ఓ సహోదరి ఇలా చెబుతోంది: “ప్రకటనా పనిలో ఉండగా ఓ వ్యక్తి, ‘నేను దేవుణ్ణి నమ్ముతాను కానీ క్రైస్తవ దేవుణ్ణి నమ్మను. మళ్లీ నా గడప తొక్కితే నా కుక్కను మీదికి వదిలేస్తా!’ అని కోపగించుకున్నాడు. ఆయన వెనకాల ఓ పెద్ద కుక్క ఉంది. రాజ్యవార్త నం. 37, ‘మతం పేరిట జరుగుతున్న దుష్క్రియలు అంతమౌతాయా?’ అనే కరపత్రాన్ని పంచిపెట్టే ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు ఆ కుటుంబంలో వేరెవరినైనా కలవొచ్చని అనుకొని ఆ ఇంటికే మళ్లీ వెళ్లాను. మళ్లీ ఆ వ్యక్తే బయటికి వచ్చాడు. నేను వెంటనే యెహోవాకు ప్రార్థించి, ఆయనతో, ‘నమస్కారమండి, మూడు రోజుల క్రితం మనం మాట్లాడింది నాకు గుర్తుంది. మీ కుక్క కూడ నాకు గుర్తే. అయినా నేనూ మీలాగే ఒకే సత్యదేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను కాబట్టి మీకు ఈ కరపత్రం ఇవ్వాలనిపించింది. దేవుడు తనను అవమానపరిచే మతాలన్నిటినీ త్వరలో శిక్షిస్తాడు. అదెలాగో మీరు దీన్ని చదివితే తెలుస్తుంది.’ ఆ వ్యక్తి ఆ కరపత్రాన్ని తీసుకున్నప్పుడు నా కళ్లను నేనే నమ్మలేకపోయాను. అక్కడి నుండి మరో ఇంటికి వెళ్లాను. కాసేపటికి, ఆ వ్యక్తి రాజ్యవార్త కరపత్రాన్ని పట్టుకొని నా దగ్గరికి పరుగెత్తుకొని వచ్చాడు. ‘నేను దీన్ని చదివాను. నేను దేవుని కోపాన్ని తప్పించుకోవాలంటే ఏమి చేయాలి?’ అని అడిగాడు”. ఆయనతో బైబిలు అధ్యయనం ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు ఆయన కూటాలకు హాజరౌతున్నాడు.

17. ఓ సహోదరి ధైర్యం బిడియస్థురాలైన బైబిలు విద్యార్థిలో ఎలా ధైర్యాన్ని నింపింది?

17 మన ధైర్యం ఇతరుల్లోనూ ధైర్యాన్ని నింపగలదు. రష్యాలోని ఓ సహోదరి బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు తోటి ప్రయాణికురాలికి ఓ పత్రిక చూపించింది. అంతలో దాన్ని చూసిన ఓ వ్యక్తి తన సీటు నుండి లేచి సహోదరి చేతుల్లోంచి ఆ పత్రికను లాక్కొని, దాన్ని నలిపి నేలకేసి కొట్టాడు. బిగ్గరగా ఆమెను తిడుతూ ఆమె ఇంటి అడ్రసు ఇవ్వమని పట్టుబట్టాడు. ఊరులో ప్రకటించొద్దని బెదిరించాడు. ఆమె సహాయం కోసం యెహోవాకు ప్రార్థించి, “దేహమునే చంపువారికి భయపడకుడి” అని యేసు చెప్పిన మాటలను గుర్తుచేసుకుంది. (మత్త. 10:28) ఆమె కంగారుపడకుండా నిల్చొని, “నేను మీకు నా చిరునామాను ఇవ్వను, ఊళ్లో ప్రకటించడం ఆపను” అని చెప్పి బస్సు దిగి వెళ్లిపోయింది. ఆమె బైబిలు విద్యార్థిని కూడ అదే బస్సులో ప్రయాణం చేస్తున్నట్లు ఆమె గమనించలేదు. ఆ విద్యార్థిని మనుష్యుల భయంవల్ల క్రైస్తవ కూటాలకు వచ్చేదికాదు. అయితే, ఆమె మన సహోదరి ధైర్యాన్ని చూసి కూటాలకు హాజరుకావడం మొదలుపెట్టాలనుకుంది.

18. యేసులా ధైర్యంగా ప్రకటించేందుకు మనకు ఏది సహాయం చేస్తుంది?

18 దేవునికి దూరమైన ఈ లోకంలో యేసులా ప్రకటించాలంటే ధైర్యం అవసరం. ధైర్యంగా ప్రకటించేందుకు మీకు ఏ విషయాలు సహాయం చేస్తాయి? ఉజ్వలమైన భవిష్యత్తును మనసులో ఉంచుకోండి. దేవునిపట్ల, పొరుగువారిపట్ల మీకున్న ప్రేమను పెంచుకోండి. ధైర్యం కోసం యెహోవాకు ప్రార్థించండి. మీరు ఒంటరివారు కారని, యేసు మీతో ఎల్లప్పుడూ ఉన్నాడని గుర్తుంచుకోండి. (మత్త. 28:20) పరిశుద్ధాత్మ మీకు బలాన్నిస్తుంది. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి, కావాల్సిన సహాయం చేస్తాడు. కాబట్టి, ధైర్యంతో మనమిలా చెబుదాం: “ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు?”—హెబ్రీ. 13:6.

మీరెలా జవాబిస్తారు?

• దేవుని సేవకులకు ధైర్యం ఎందుకు అవసరం?

• ధైర్యంగా ఉండే విషయంలో మనం

క్రీస్తుకు పూర్వం జీవించిన నమ్మకమైన దేవుని సేవకుల నుండి

యేసుక్రీస్తు నుండి

తొలి క్రైస్తవుల నుండి

మన కాలంలోని తోటి క్రైస్తవుల నుండి ఏమి నేర్చుకోవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[21వ పేజీలోని చిత్రం]

యేసు ధైర్యంగా మతనాయకుల వేషధారణను ఎత్తిచూపాడు

[23వ పేజీలోని చిత్రం]

ప్రకటించేందుకు కావాల్సిన ధైర్యాన్ని యెహోవా ఇస్తాడు