కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సత్యం ఇక సమాధి అయిపోయినట్టేనా?

సత్యం ఇక సమాధి అయిపోయినట్టేనా?

 నిజానికి, అబద్ధానికి మధ్య ఉన్న గీత చెరిగిపోయినట్టు మీకు అనిపిస్తుందా? ఇప్పుడు జనాలు సత్యాన్ని, వాస్తవాల్ని నమ్మే బదులు వాళ్ల మనసుకు ఏది నచ్చితే అదే సరైనదని నమ్ముతున్నారు. ప్రపంచం మొత్తంలో చాలామంది, అసలు సత్యం అనేదంటూ ఏదీ లేదు అనే అభిప్రాయంలో ఉన్నారు.

 ఆ అభిప్రాయం కొత్తదేమీ కాదు. దాదాపు 2,000 సంవత్సరాల క్రితం, పొంతి పిలాతు అనే రోమా అధిపతి యేసును, “సత్యం అంటే ఏమిటి?” అని వెటకారంగా అడిగాడు. (యోహాను 18:38) పిలాతు జవాబు కోసం ఆగలేదు కానీ, ఆ ప్రశ్న మాత్రం ముఖ్యమైనదే. బైబిల్లో ఆ ప్రశ్నకు జవాబు ఉంది. నిజమేదో, అబద్ధమేదో తెలియక తికమకపడుతున్న ఈ లోకంలో బైబిలు మీకు దారి చూపించగలదు.

అసలు సత్యం అనేది ఏదైనా ఉందా?

 ఉంది! బైబిల్లో “సత్యం” అనే పదం నిజమైనదాన్ని, సరైనదాన్ని సూచిస్తుంది. యెహోవా a “సత్యవంతుడు” అని, అసలైన సత్యానికి ఆయనే మూలం అని బైబిలు చెప్తుంది. (కీర్తన 31:5) బైబిల్లో దేవుని నుండి వచ్చిన సత్యం ఉంది. ఆ సత్యాన్ని వెలుగుతో పోల్చవచ్చు. అయోమయంలో తచ్చాడుతున్న ఈ లోకంలో ఆ వెలుగే మనకు దారి చూపిస్తుంది.—కీర్తన 43:3; యోహాను 17:17.

మీరు సత్యాన్ని ఎలా తెలుసుకోవచ్చు?

 మనం బైబిల్లో ఉన్న సత్యాన్ని గుడ్డిగా నమ్మేయాలని దేవుడు చెప్పట్లేదు. మనకు నచ్చినదాన్ని కాదుగానీ, బైబిల్ని పరిశీలించి, మన ఆలోచనా సామర్థ్యాల్ని ఉపయోగించి సత్యాన్ని తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. (రోమీయులు 12:1) మనం “నిండు మనసుతో” తనను తెలుసుకొని ప్రేమించాలన్నదే ఆయన ఆశ. బైబిలు నుండి నేర్చుకున్నవి నిజమని నిర్ధారించుకున్నాకే వాటిని నమ్మమని ఆయన చెప్తున్నాడు.—మత్తయి 22:37, 38; అపొస్తలుల కార్యాలు 17:11.

అబద్ధాలు ఎక్కడి నుండి పుట్టుకొచ్చాయి?

 అబద్ధాలాడడం మొదలుపెట్టింది, దేవుని శత్రువైన సాతాను. అతను “అబద్ధానికి తండ్రి” అని బైబిలు చెప్తుంది. (యోహాను 8:44) అతను మొదటి మనుషులకు, దేవుని మీదే అబద్ధాలు చెప్పాడు. (ఆదికాండం 3:1-6, 13, 17-19; 5:5) అప్పటినుండి సాతాను దేవుని గురించిన నిజాల్ని సమాధి చేస్తూ, దానిమీద అబద్ధాల మేడలు కట్టుకుంటూ వెళ్తున్నాడు.—ప్రకటన 12:9.

ప్రజలు ఇప్పుడు ఎందుకు అవలీలగా అబద్ధాలు ఆడేస్తున్నారు?

 బైబిలు మన కాలాన్ని “చివరి రోజులు“ అని పిలుస్తుంది. ఈ చివరి రోజుల్లో, సాతాను ఇంతకుముందు కన్నా ఎక్కువగా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నాడు. మామూలుగా, ప్రజలు అవతలివాళ్లను మోసం చేయడానికి, వాళ్లను దోచుకోవడానికి అబద్ధాలాడతారు. (2 తిమోతి 3:1, 13) ఇప్పుడు, అబద్ధాలు చాలా మతాల్లో కూడా దూరిపోయాయి. మన కాలంలో ప్రజలు “సత్యాన్ని వినడం మానేసి,” “తమకు నచ్చేవాటిని చెప్పే బోధకుల్ని పోగుచేసుకుంటారు” అని బైబిలు ముందే చెప్పింది.—2 తిమోతి 4:3, 4.

సత్యం ఎందుకంత ప్రాముఖ్యం?

 ఇద్దరి వ్యక్తుల మధ్య నమ్మకం ఉండాలంటే, సత్యమే ఆధారం. సత్యం లేకపోతే నమ్మకం ఉండదు, నమ్మకం లేకపోతే స్నేహాలే కాదు, సమాజాలే కూలిపోతాయి. మన ఆరాధన సత్యం మీద ఆధారపడి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. బైబిలు ఇలా చెప్తుంది: “[దేవుణ్ణి] ఆరాధించేవాళ్లు పవిత్రశక్తితో, సత్యంతో ఆరాధించాలి.” (యోహాను 4:24) అబద్ధ మతాన్ని గుర్తుపట్టి దాన్నుండి బయటికి రావడానికి బైబిల్లో ఉన్న సత్యం మీకు ఎలా సహాయం చేస్తుందో తెలుసుకోవడానికి, “దేవుడు ప్రేమలేని వాడని అనుకునేలా చేసిన అబద్ధాలు” అనే ఆర్టికల్స్‌ చదవండి.

నేను సత్యం తెలుసుకోవాలని దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు?

 మీరు రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు, అందుకోసం మీరు ఆయన గురించి సత్యం తెలుసుకోవాలి. (1 తిమోతి 2:4) ఏది తప్పు, ఏది ఒప్పు అనే విషయంలో దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసుకుని, దాని ప్రకారం జీవిస్తే మీరు ఆయనకు బెస్ట్‌ ఫ్రెండ్‌ అవుతారు. (కీర్తన 15:1, 2) ప్రజలకు సత్యం గురించి చెప్పడానికి దేవుడు యేసును భూమ్మీదికి పంపించాడు. మనం యేసు మాటల్ని వినాలని దేవుడు కోరుకుంటున్నాడు.—మత్తయి 17:5; యోహాను 18:37.

దేవుడు అబద్ధాలాడే వాళ్లను ఎప్పటికైనా తీసేస్తాడా?

 తీసేస్తాడు. అవతలివాళ్లను మోసం చేసి దోచుకునే వాళ్లంటే దేవునికి అసహ్యం. అబద్ధాలాడుతూ ఉండే వాళ్లను భూమ్మీద లేకుండా చేస్తానని ఆయన మాటిచ్చాడు. (కీర్తన 5:6) అది జరిగినప్పుడు ఈ మాట కూడా నెరవేరుతుంది: “నిజం మాట్లాడే పెదాలు ఎప్పటికీ నిలిచివుంటాయి.”—సామెతలు 12:19.

a యెహోవా అనేది దేవుని పేరు. (కీర్తన 83:18) “యెహోవా ఎవరు?” అనే ఆర్టికల్‌ చూడండి.